జగిత్యాల జిల్లాలో ఎంపీడీవోలకు దక్కని గుర్తింపు!
జగిత్యాల, ఆగస్టు 15(Telangana Insight): మండల స్థాయి పాలనకు వారే వెన్నుముక… సంక్షేమ పథకాల అమలు నుంచి పారిశుధ్య నిర్వహణ వరకు అన్నీ తామై నడిపిస్తారు. కానీ, స్వాతంత్ర్య దినోత్సవం వేళ వారికి దక్కిందేమిటి అంటే ‘మౌనం… విస్మరణ’.
జగిత్యాల జిల్లా పరిధిలోని 20 మండలాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఎంపీడీవోల విషయంలో ఇప్పుడు ఇదే చర్చ జోరుగా సాగుతోంది. 99 రోజుల ప్రణాళిక, ఉపాధి హామీ, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పింఛన్లు, విసిలు, సమీక్షలు… ఇలా ఏ రకమైన ప్రభుత్వ కార్యక్రమమైనా ముందుండి నడిపించే ఎంపీడీవోలకు ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ ప్రశంసా పత్రాల్లో తీవ్ర నిరాశే ఎదురైంది.
అవార్డుల జాబితాలో ‘జీరో’ స్థానం.
మొత్తం అవార్డులు:
జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖలకు చెందిన 287 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
పంచాయతీ రాజ్ కేటగిరీ:
డీఎల్పీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, చివరకు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, కారోబార్లకు సైతం అవార్డులు వరించాయి.
ఎంపీడీవోల పరిస్థితి:
మండల స్థాయి అధికారులైన 20 మంది ఎంపీడీవోలలో ఏ ఒక్కరికీ కూడా జాబితాలో స్థానం దక్కకపోవడం గమనార్హం.
మండలంలో క్షేత్రస్థాయిలో నిరంతరం శ్రమిస్తూ, ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరవేస్తున్న ఎంపీడీవోలను ఇలా పూర్తిగా విస్మరించడం వారి పనితీరును చిన్నచూపు చూడడమేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. “అయ్యో పాపం… ఎంపీడీవోలు అంత పెద్ద తప్పేం చేశారు?” అంటూ జిల్లా ప్రజలు, ఉద్యోగ వర్గాలు అధికారుల తీరుపై తీవ్రoగా చర్చించుకుంటున్నాయి.
