జగిత్యాల జిల్లా విద్యుత్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్.
విద్యుత్ సౌధ ఎదుట మహాధర్నాకు తరలిన విద్యుత్ ఉద్యోగులు
జగిత్యాల, ఆగష్టు 19(Telangana Insight): నల్గొండ జిల్లా దామరచర్ల వద్ద నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో బొగ్గు, బూడిద నిర్వహణ విభాగాలకు సంబంధించిన ఔట్సోర్సింగ్ టెండర్లను తక్షణమే రద్దుచేయాలని విద్యుత్ ఉద్యోగుల జేఏసి జగిత్యాల జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఈ ప్రైవేటీకరణ నిర్ణయానికి నిరసనగా ముందుగా ప్రకటించిన పిలుపుమేరకు బుధవారం హైదరాబాద్ లోని విద్యుత్ సౌధ వద్ద చేపట్టిన మహాధర్నాకు జగిత్యాల జిల్లా నుంచి జేఏసీ నాయకులు, విద్యుత్ ఉద్యోగులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా జేఏసి చైర్మెన్ అజీజ్ అహ్మద్, కన్వీనర్ ప్రసాద్, సెక్రటరీ రాంజీనాయక్. కో కన్వీనర్లు వరుణ్ కుమార్ లు మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన రూ.255 కోట్ల సర్వీస్ టెండర్లతో విద్యుత్ రంగానికి, నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని అందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లు, ఆర్టిజన్లకు సంబంధించిన పీఆర్సీ 2026వేతన సవరణ కమిటీ ఏర్పాటు చేయాలని, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లోని బొగ్గు, బూడిద విభాగంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకం తక్షణమే ఉపసంహరించుకోవాలని, 1999 నుంచి 2004 మధ్య నియమించిన ఉద్యోగులకు జీపీఎఫ్, పెన్షన్ సౌకర్యం కల్పించాలని, ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు అన్ని కేడర్లలో నియామకాలు చేపట్టాలని, మహారాష్ట్ర మోడల్ ప్రకారం రైతు డిస్కంలు ఏర్పాటు చేయాలని, అన్ని కేడర్లలో ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పిం చడంతో పాటు, సాధారణ బదిలీలు చేపట్టాలని, జెన్ కోలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచాలని, ట్రాన్స్ మిషన్, డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ను మెరుగుపర్చాలని ఉమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసి నాయకులు, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.

మహా ధర్నాకు తరలి వెళ్తున్న జిల్లా విద్యుత్ జేఏసీ నాయకులు
