హైదరాబాద్, ఆగష్టు 28(Telangana Insight):రాఖీ పౌర్ణమి పండుగను ఆసరాగా చేసుకుని ఆర్టీసీ ప్రయాణికులపై అదనపు ఛార్జీల భారం మోపుతోంది. పండుగ రద్దీని క్యాష్ చేసుకునేందుకు స్పెషల్ బస్సుల పేరుతో ఇష్టానుసారంగా చార్జీలు పెంచుతుండటంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.సాధారణ రోజులతో పోలిస్తే పండుగ సమయంలో 1:50 నిబంధన పేరు చెప్పి ఆర్టీసీ అదనంగా ₹100 నుండి ₹150 వరకు వసూలు చేస్తోంది. ఉదాహరణకు సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుండి కరీంనగర్కు ఛార్జీ ₹290 ఉండగా, ప్రస్తుతం రాఖీ పండుగ ప్రత్యేక ఛార్జీ కింద దానిని ఏకంగా ₹400కు పెంచేశారు.స్పెషల్ బస్సుల్లో ప్రయాణికులు ఎక్కిన తర్వాత మార్గమధ్యంలో ఆర్టీసీ కండక్టర్లు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. పండుగ వేళ సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల అవసరాన్ని ఆర్టీసీ సొమ్ము చేసుకుంటోందని, పండుగ ప్రయాణాన్ని భారంగా మార్చేసిందని ప్రయాణికులు లబోదిబోమంటున్నారు.


