జగిత్యాలలో అధికారులను నిలదీసిన స్థానిక మహిళలు..!
జగిత్యాల, ఆగస్టు 20(Telangana Insight): నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో స్థానిక మహిళలు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 22న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాలనీలో పర్యటించనున్న నేపథ్యంలో, అధికారులు హడావుడిగా పారిశుధ్య పనులు, ఇతర ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.అయితే, ఈ పారిశుధ్య పనులు కేవలం మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటన కోసమే చేస్తున్నారా అని స్థానిక మహిళలు అధికారులను, శానిటేషన్ సిబ్బందిని సూటిగా నిలదీశారు. నేతలు సంచరించే ప్రధాన రహదారులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిసరాల్లోనే క్లీనింగ్ పనులు చేస్తూ, ఇందిరమ్మ ఇళ్ల వైపు పారిశుధ్య పనులను పూర్తిగా విస్మరించారని వారు ఆరోపించారు. కాలనీ లోపల ఉన్న వందలాది ఇళ్ల వద్ద పారిశుధ్య పనులను పట్టించుకోకుండా, కేవలం ప్రచారానికే క్లీనింగ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారని మహిళలు మండిపడ్డారు. కేవలం ప్రజాప్రతినిధుల పర్యటనల సమయంలోనే కాకుండా, కాలనీ అంతటా రోజూ పారిశుధ్య పనులను సమర్థవంతంగా నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


